82 వేల హెక్టార్లలో ఏపీఎఫ్ డీసి తోటల పెంపకం
- ప్రతి ఏడూ 3వేల హెక్టార్ల అదనపు సాగు లక్ష్యం
- పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక చర్యలు
విజయవాడ : పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం, అటవీ ఉత్పత్తులు పెంచడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో 65,814 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న అటవీ ప్రాంతంలో గొప్ప వృక్ష జాతులు, జంతువులు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని పరిరక్షించుకుంటూ మానవ నిర్మిత అడవుల పెంపకానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. వాణిజ్య అటవీ ఉత్పత్తులు పెంచడానికి, దేశీయ, పారిశ్రామిక అవసరాలు తీర్చడానికి 25 ఏళ్ల క్రితం ఏర్పాటైన ఏపీ ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ (ఏపీఎఫ్ ఢీసీ)82,380 హెక్టార్లలో తోటలను పెంచుతోంది. ఏడాదికేడాది ఆ విస్తీర్ణాన్ని పెంచుకుంటూ పోతోంది. ప్రధానంగా ఈ కార్పోరేషన్ యూకలిప్టస్, వెదురు, టేకు, జీడి, కాఫీ, మిరియాలు, ఎర్రచందనం, ఔషద మొక్కలను పెంచుతోంది. ఒక క్రమ పద్దతిలో ఏడాదికేడాది మానవ నిర్మిత అడవీ ప్రాంత విస్తీర్ణాన్ని పెంచుకుంటూ పోతోంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదలుకొని మూడేళ్లపాటు 2018-19 వరకు ప్రతి ఏడాది 3,300 హెక్టార్ల విస్తీర్ణంలో తోటలను పెంచుకుంటూ పోవాలని యాక్షన్ ప్లాన్ రూపొందించింది. రెండు వేల హెక్టార్లలో యూకలిప్టస్ మొక్కలు, 200 హెక్టార్లలో వెదురు మొక్కలు, వంద హెక్టార్లలో టేకు మొక్కలు చొప్పున ప్రతి ఏడాది అదనంగా సాగు చేయాలని కార్పోరేషన్ నిర్ణయించింది.
ఉభయ గోదావరి, నెల్లూరు జిల్లాలలో యూకలిప్టస్, వెదురు, జీడి తోటలను ఎక్కువగా పెంచుతున్నారు. విశాఖ జిల్లాలో మిరియాలు, కాఫీ తోటలను పెంచుతున్నారు. తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాలలో ఔషద మొక్కలను పెంచుతున్నారు. చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాలలో ఎర్రచందనం చెట్లను పెంచుతారు. రాష్ట్రంలో ఫర్నీచర్ పరిశ్రమకు అవసరమైన కలపను సరఫరా చేయడంలో ఈ కార్పోరేషన్ కీలక పాత్ర పోషిస్తోంది. కలపను, ఇతర అటవీ ఉత్పత్తులను ఇది మార్కెటింగ్ చేస్తుంది. అలాగే అటవీ ప్రాంతంలో మొక్కలు నాటడంతోపాటు ఉత్పాదక పెంచడానికి, గిరిజనులకు, ఇతర స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించడానికి ఇది కృషి చేస్తోంది.
పర్యావరణ పరిరక్షణతోపాటు సహజసిద్ధ ప్రకృతి సౌందర్యాలను తిలకించేవిధంగా అటవీ పర్యాటక ప్రాంతాలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. అలాగే అక్కడి గిరిజనులు, గ్రామీణ ప్రాంతవాసుల సంక్షేమం కోసం కూడా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది.
జారీ చేసినవారు : కమిషనర్, సమాచార, పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం